Thursday, March 22, 2012

ఉపఎన్నికల గుణపాఠాలు


ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి రాజకీయ పార్టీలకు గుణపాఠాలు చెప్పాయి. నేర్చుకోవాలే కానీ అన్ని  పార్టీలకూ పాఠాలు ఉన్నాయి. స్పష్టంగా, నిర్ద్వంద్వంగా తెలంగాణవాదాన్ని వినిపించిన పార్టీలకే తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలలో ప్రజలు పట్టం కట్టారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించి ఆ పార్టీకి భవిష్యత్తులో ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్నదనే సంకేతాన్నిపంపించారు.
ఎన్నికలలో గెలుపొందడానికి కేవలం వనరులూ, తెలివితేటలూ, వ్యూహరచనా సామర్థ్యం కలిగిన నాయకులూ, హంగులూ, ఆర్భాటాలూ, అపారమైన నిధులూ ఉన్నంత మాత్రాన సరిపోదు. స్పష్టమైన విధానం కావాలి. ఆ విధానానిని ప్రజామోదం ఉండాలి. ఇంతవరకూ తెలంగాణవాదం పట్ల కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానం సరైనది కాదని ప్రజలు మరో సారి నిరూపించారు. ఇంకా ప్రజలను ఏమార్చడం, మాయ చేయడం సాధ్యం కాదని రెండు ప్రధాన పార్టీలూ గుర్తించాలి. తెలంగాణ సమస్యపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని నిర్భయంగా ప్రకటించాలి. ఆ నిర్ణయానికి ప్రజామోదం ప్రోదిచేయడానికి అవసరమైతే ప్రచారోద్యమం సాగించాలి. అంతే కానీ లోపల ఒక మాట పైకి మరో మాట అన్న చందంగా బూటకపు రాజకీయం చేయడం వల్ల రాష్ట్రానికే కాదు తమ పార్టీలకూ తీరని నష్టం జరుగుతుందని అధినాయకులు గుర్తించాలి.
ఉప ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి ఎటువంటి గుణపాఠం ఉన్నది? ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేర్చుకోవలసిన పాఠం అందరిని కలుపుకొని పోవాలని. ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఏకపక్షంగా నిర్ణయించి మహబూబ్ నగర్ నియోజవర్గంలో ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టారు. రాజకీయ జేఏసీలో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీతో ముందుగా సంప్రతించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో భాజపా కూడా పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. లోగడ తెరాస మహబూబ్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడుగా పని చేసిన ఎన్నం శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ఎంచుకుంది. ముస్లిం అభ్యర్థికి వ్యతిరేకంగా హిందూ ఓట్లను సమీకరించే విద్య యథావిధిగా ప్రదర్శించింది. రాజకీయ జేఏసీ సైతం అటు భాజపానూ, ఇటు తెరాసనూ బలపరచకుండా ఆత్మప్రబోధం ప్రకారం ఓటు చేయవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాసగౌడ్ తెరాస అభ్యర్థిత్వం ఆశించి భంగపడటంలో ఉద్యోగులు సైతం భాజపా అభ్యర్థి విజయానికి కృషి చేశారు.  మొత్తం మీద చివరిదాకా ఉత్కఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి గట్టెక్కారు. దక్షిణ తెలంగాణలో భాజపా పాదం మోపడానికి అవకాశం కలిగింది. తెరాస అధ్యక్షుడి ఆంతర్యం ఏమిటో ఊహించడం కష్టం కాదు. భాజపాతో భుజం కలపడం ఆయనకు ఇష్టం లేదు. భాజపాకు దూరంగా ఉంటున్నట్టు కాంగ్రెస్ అధిష్ఠానానికి సంకేతం పంపడం, ముస్లింలకు తెరాస ప్రాముఖ్యంగా ఇస్తుందని తెలియజేయడం కేసీఆర్ నిర్ణయం లక్ష్యం కావచ్చు. మొత్తం మీద 2014లో జరగబోయే ఏన్నికలలో తెలంగాణవాదం వినిపించే అన్ని పార్టీలనూ, వ్యక్తులనూ కలుపుకొని పోవలసిందేననీ, లేకపోతే ఓటమి అనివార్యతమనీ, అది తెలంగాణవాదానికి నష్టదాయకమనీ ఈ ఉప ఎన్నికలు తెరాసను హెచ్చరించాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చాలా శ్రమకోర్చి ఉపఎన్నికలలో ప్రచారం చేశారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబునాయుడిని ఇంకా పూర్తిగా విశ్వసించడం లేదని భావించడానికి ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనం. తెలుగు దేశం పార్టీ అధినేత వినిపించిన తెలంగాణవాదానికి ప్రజలు సమ్మతించలేదు. రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రజలు ఆమోదించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము సిద్ధమేనంటూ 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించడానికి  పూర్వం దక్షిణ తెలంగాణలో తెలంగాణవాదం అంత బలంగా లేదు. అప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ అవకాశవాద రాజకీయానికి ఒడిగట్టకుండా సమైక్యవాదాన్ని వినిపించి ఉన్నట్లయితే రాష్ట్రంలో రాజకీయం బహుశా మరో విధంగా ఉండేది. అటువంటి సూత్రబద్ధమైన విధానాన్ని అవలంబించడానికి అవసరమైన తెగువ, నైతిక స్థాయి ప్రధాన ప్రతిపక్షంలో కొరవడటంతో  రాష్ర ప్రజలు అందుకు మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఏదో ఒక స్పష్టమైన, అసందిగ్ధమైన నిర్ణయం తీసుకొని ప్రజల ముందుకు వెడితే ప్రయోజనం ఉంటుంది. ఇంతకంటే నష్టం అయితే జరగదు. ద్వంద్వ వైఖరికి స్వస్తి చెప్పి నిర్దుష్టమైన విధానాన్ని ప్రకటించి, ఆచరించడం ద్వారా తెలుగు ప్రజలకు చంద్రబాబునాయుడు గొప్ప మేలు చేసినవారు అవుతారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించినా ఫర్వాలేదని నిర్ణయించినా సరే లేదా రాష్ట్రం సమైక్యం ఉండాలని నిర్ణయించినా సరే, ఏ నిర్ణయమైనా మనస్ఫూర్తిగా తీసుకొని నిజాయితీగా దాని అమలు కోసం కృషి చేస్తే రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరిగి ఆదరిస్తారు. ప్రత్యర్థి ఎత్తులకు తగినట్టు పైఎత్తులు వేయాలన్న జిత్తులమారి రాజకీయాన్ని ప్రజలు అంగీకరించడం లేదనీ, అసహ్యించుకుంటున్నారనీ గ్రహిస్తే ఎంతో శుభం జరుగుతుంది. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధికి దోహదం చేసిన నాయకుడిగా చంద్రబాబునాయుడిపైన ఈ నైతిక బాధ్యత ఉన్నది. ఈ కర్తవ్యాన్ని ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ నాయకులకు కూడా ఉప ఎన్నికల ఫలితాలలో గొప్ప గుణపాఠం ఉంది. రాష్ట్రస్థాయిలో నాయకులకు నిర్ణయాధికారం లేదని వారే చెబుతున్నారు. అది సాకుగా పెట్టుకొని దొంగాట ఆడుతున్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులూ ఈ వంచన శిల్పంలో ఆరితేరారు. ఫలితంగా రాజకీయ నాయకులన్నా, రాజకీయాలన్నా సామాన్య ప్రజలకు ఏవగింపు కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఢిల్లీలో అధిష్ఠాన దేవత తీసుకుంటారు కనుక ఆమె ప్రధమ్యాలు ఏమిటో అర్థం చేసుకుంటే ఆ పార్టీ విధానం ఎట్లా ఉండబోతున్నదో ఊహించవచ్చు. ‍ఉత్తర ప్రదేశ్ లో రాహుల్ గాంధీ నిర్వాకం తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి చాలా ముఖ్యమైన రాష్ట్రం అవుతుంది. ఉపఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ మున్ముందు కాంగ్రెస్  పార్టీకి ప్రజలు చుక్కలు చూపిస్తారని అంచనా వేయవచ్చు. రెండు ప్రాంతాలలో భ్రష్టు పట్టడం కంటే కనీసం ఒక ప్రాంతాన్ని అయినా కాపాడుకోవడానికి ప్రయత్నించాలని కాంగ్రెస్ నాయకత్వం సహజ ఆత్మరక్షణ ధోరణిలో భాగంగా భావిస్తుంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సయోధ్య కుదుర్చుకోవడం కుదరదు. ప్రజలు మెచ్చరు. ఒక వైపు జగన్ ఆస్తులమీద, ఆప్తుల మీద సీబీఐ దాడులు నిర్వహిస్తూ మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం రాజీ చర్చలు జరపడం కుదరని పని. సీమాంధ్రలో మూడు పార్టీల మధ్య పోరు అనివార్యం. 2014లో చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్, చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జగన్మొహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహురీ అనివార్యం. అది మహత్తర ఎన్నికల సంగ్రామం కాబోతోంది. దాని ఫలితం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో రాజీ పడాలో లేదో నిర్ణయించే అవకాశం కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి ఉంది. అదంతా జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత నెలకొనే పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో పట్టు సాధించాలని కాంగ్రెస్ భావించినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేసుకోవడం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, భాజపాలతో తలబడటం కాంగ్రెస్ వ్యూహం అవుతుంది. అట్లా కాకుండా రాష్ట్రాన్ని విభజించడం తెలుగువారికి నష్టదాయకమనీ, తెలుగువారి ప్రయోజనాలకోసం స్వీయప్రయోజనాలను త్యాగం చేయాలనే మహత్తరమైన, ఉదాత్తమైన ఆలోచన సోనియాగాంధీ చేస్తే ఆ సంగతి ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. ప్రజలలో సమైక్యభావనను పెంపొందించడానికి సత్వరం చర్యలు చేపట్టాలి. ఇంతవరకూ సాగించిన మార్మిక విధానానికి స్వస్తి చెప్పాలి. ఉప ఎన్నికలు ప్రసాదించిన ఈ గుణపాఠాలను నేర్చుకోవడానికి నిరాకరించే పార్టీలకూ, రాజకీయ నాయకులకూ నిష్కృతి ఉండదని వేరే చెప్పనక్కరలేదు.

Thursday, February 3, 2011

కలుగులోని దొంగలందరూ బయటకొస్తారా..?

స్వతంత్ర భారతంలో అతిపెద్ద అవినీతి కుంభకోణం. లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా పోయిన వైనం. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుందా? దొంగలు దొరుకుతారా? దొంగలందరూ దొరుకుతారా? దొంగసోమ్ము మొత్తం దొరుకుతుందా? అసలు దొంగలు ఎవరు? లబ్ధిదారులు ఎవరు?

అవినీతిని అంతం చేయాలన్న అంకితభావంతోనే టెలికాం మాజీ మంత్రి రాజాను సీబీఐ అరెస్టు చేసిందని అనుకోవాలా? ప్రధాని కార్యాలయం నుంచి అందిన సంకేతాల మేరకే వ్యవహరించిందని భావించాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా సీబీఐ ఇటువంటి విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని నమ్మగలమా? మూడు విడతల ప్రశ్నించినా, ఢిల్లీలో, తమిళనాడులో అనేక విడతల సోదాలు చేసినా దర్యాప్తు అంగుళం ముందుకు కదలలేదు ఎందుకని? సోనియాగాంధీ, కరుణానిధి మధ్య ఢిల్లీలో సమాలోచన జరిగే వరకూ రాజాను అరెస్టు చేయకుండా సీబీఐ చేతులు కట్టుకొని ఉన్నది ఎందుకని? తమిళనాడులో, మరి నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న కారణంగానే, ప్రతిపక్షాలు పార్లమెంటు సంయుక్త సంఘం-జేపీసీ- నియామకంకోసం పట్టుపడుతున్న కారణంగానే, ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసిన కారణంగానే రాజా అరెస్టు ఒక ఎత్తుగడగా జరిగిందా? ఇది కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకుంటున్న నష్టనివారణ చర్యలలో భాగమేనా?
బుధవారంనాడు రాజానూ, టెలీకం మాజీ కార్యదర్శి సిద్దార్థ బెహురానూ, ఐఆర్ ఎస్ అధికారి ఆర్కే చందోలియానూ సీబీఐ అరెస్టు చేసినట్టు వచ్చిన వార్త ఇప్పటికే ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.
రెండవ తరం వాయుతరంగాల-టూజీ స్ప్రెక్ట్రమ్- కుంభకోణంలో మరికొంత మంది పాత్రధారులను అరెస్టు చేయవచ్చు. ప్రశ్నించవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. వారికి జైలు శిక్ష సైతం పడవచ్చు. అనంతరం వారు సుఖరామ్ లాగా బెయిలు సంపాదించుకొని సుఖంగా జీవితం గడపవచ్చు. మరి సూత్రధారుల పాత్ర ఏమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఏమిటి? రాజాను బలిపశువును చేసినంత మాత్రాన మన్మోహన్ సింగ్ కు ఈ కుంభకోణంలో ప్రమేయం లేకుండా పోతుందా? యూపీఏ అధ్యక్షురాలి హోదాలో ఏడేళ్ళుగా చక్రం తప్పుతున్న సోనియాగాంధీకి నైతిక బాధ్యత లేకుండా పోతుందా?
ఈ కుంభకోణంలో దోషులను పట్టుకోవాలనీ, జేపీసీని నియమించాలనీ ఉద్ఘోషిస్తున్నవారందరూ అవినీతికి అతీతులు కాకపోవచ్చు. ఎన్ డీ ఏ హయాంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఎన్ డీ ఏ పాలనలోనూ కుంభకోణం జరిగింది కనుక రాజా మార్కు కుంభకోణంపైన దర్యాప్తు జరగాలని కోరే నైతిక హక్కు ఎన్ డీ ఏ నాయకులకు లేదని వాదించడం వితండ వాదం అవుతుంది. టెలికాం మంత్రిత్వ శాఖ అత్యంత కీలకమైనదని మన్మోహన్ సింగ్ కూ, సోనియాకూ తెలుసు. రాజా కంటే ముందు ఈ శాఖను నిర్వహించినవారికి అవినీతి మరకలు అంటినట్టు అందరికీ తెలుసు. పీవీ నరసింహారావు మంత్రిమండలిలో టెలికాం శాఖ నిర్వహించిన సుఖరామ్ పైన సీబీఐ 1996లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్ లో ఆయన నివాసాలపైన సీబీఐ దాడులు జరిపింది. 3.62 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది. పదమూడేళ్ళ విచారణ తర్వాత 2009లో సుఖ్ రామ్ కు మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు. నెల రోజులు జైలులో గడిపి బెయిలు సంపాదించుకున్నారు. టెలిఫోన్ కంపెనీలకు లాభాలు సంపాదించిపెట్టడానికి వీలుగా లైసెన్సింగ్ పద్ధతికి స్వస్తి చెప్పడం ద్వారా అవినీతికి ఎన్ డీ ఏ సర్కార్ తలుపులు తెరిచింది. ఈ పద్ధతిని వ్యతిరేకించిన జగ్ మోహన్ మంత్రి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. జస్వంత్ సింగ్ నాయకత్వంలోని కమిటీ సిఫార్సు మేరకు 1999 జూలైలో లైసెన్స్ పద్ధతికి స్వస్తి పలికారు. ఈ కారణంగా దేశ ఖజానాకు యాభై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆరోపించారు. భారతీయ జనతా పార్టీలో నిధులు సేకరించే నేర్పరిగా పేరున్న ప్రమోద్ మహాజన్ రిలయన్స్ సంస్థకు లాభం కలిగే విధంగా ట్రాయ్ సిఫార్సులను తుంగలో తొక్కారు. దీని వల్ల అప్పటి లెక్కల ప్రకారం పదకొండు వందల కోట్ల రూపాయల నష్టం దేశ ఖజానాకు వచ్చిందని అంచనా. ఇటువంటి కీలకమైన, అవినీతికి ఆస్కారం పుష్కలంగా ఉన్న శాఖను ఎవరికి అప్పగించాలి? నీతి, నిజాయితీలను నిజజీవితంలో పాటించే వ్యక్తి చేతుల్లో ఈ శాఖ బాధ్యతలు పెట్టాలి. రాజాకు కానీ డిఎంకే కి చెందిన మంత్రులకు కానీ అటువంటి మంచి పేరు లేదని ప్రధానికి తెలియదా? సంకీర్ణ పితలాటకం వల్ల కరుణానిధి పట్టుదల వల్ల రాజాకే టెలికాం మంత్రిత్వ శాఖను అప్పగించవలసి వస్తే ఆ శాఖ పని తీరుపైన నిరంతరం నిఘా ఉంచవలసిన బాధ్యత ప్రధానికి లేదా? 2007 నుంచి 2008 వరకూ ప్రధానికీ, రాజాకీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలిస్తే రాజా చేస్తున్నది ఏమిటో ప్రధానికి తెలుసనే అనుకోవలసి వస్తుంది. రాజా అవలంబిస్తున్న పద్ధతిపై మొదట్లో వివరణ కోరిన ప్రధాని అనంతరం ఆ పద్ధతిని ఆమోదించారనే అభిప్రాయం కలుగుతుంది. కుంభకోణం జరుగుతున్నట్టు పయనీర్ పత్రికలో పరిశోధనాత్మక వార్తలు పుంఖానుపుంఖంగా వచ్చినా, సెంట్రల్ విజలెన్స్ కమిషన్ హెచ్చరించినా, కాగ్ నివేదిక తూర్పారపట్టినా ప్రధాని చలించలేదు. సుప్రీంకోర్టు తలంటిన తర్వాతనైనా వెంటనే స్పందించలేదు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వ సుస్థిరతను పణం పెట్టడానికి సంకోచించని మన్మోహన్ సింగ్ అవినీతి రాజాపై చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్కించారు. సోనియా సాధ్యమైనంత వరకూ మౌనం పాటిస్తే, మన్మోహన్ సందర్భం వచ్చిన ప్రతిసారీ రాజాను వెనకేసుకొని వచ్చారు. రాజా అక్రమం చేయలేదంటూ కితాబు ఇస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు ఒకటికి రెండు సార్లు చురకలు వేయడం ప్రారంభించిన తర్వాత, ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసి రాజీ లేని పోరాటం సాగించిన అనంతరమే యూపీ ఏ సర్కార్ లో చురుకు పుట్టింది. మూడేళ్ళ కిందటే కుంభకోణం జరుగుతున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రధాని వ్యవహరించారు. ప్రతిష్ఠాత్మకమైన, బలమైన ప్రధాని కార్యాలయానికి అన్ని మంత్రిత్వ శాఖలలో ఏమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. టెలికాం కుంభకోణం జరుగుతున్నట్టు ప్రధానికి తెలియదంటే ఎట్లా నమ్మడం? సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సంవత్సరం పాటు చేసింది ఏమీ లేదు. సీబీఐ కూడా ప్రభుత్వం కదిలినప్పుడే కదిలింది. అంటే పాలకుల కనుసన్నలలోనే మెదిలింది. ఇంత జరిగిన తర్వాత రాజా చేత రాజీనామా చేయించక తప్పలేదు. కానీ ప్రతిపక్షం కోరుతున్న జేపీసీ నియామకానికి మాత్రం యూపీఏ సిద్ధంగా లేదు. ఈ లోగా మరో నాటకం. రాజా రాజీనామా అనంతరం టెలికాం శాఖను అదనంగా స్వీకరించిన మానవ వనరుల మంత్రి కపిల్ సిబ్బల్ చావుతెలివి ప్రదర్శించారు. గజం మిథ్య పలాయనం మిథ్య అంటూ అడ్డంగా వాదించే సాహసం చేశారు. పార్లమెంటు సభ్యులనూ, దేశ ప్రజలనూ అవివేకులుగా జమకట్టి బుకాయించబోయారు. అవమానించబోయారు. స్పెక్ట్రమ్ అమ్మకాల విషయంలో కుంభకోణం ఏమీ లేదనీ, దేశ ఖజానాకు నయాపైసా కూడా నష్టం రాలేదనీ దర్జాగా ప్రకటించారు. మరోదేశంలో అయితే పనిగట్టుకొని అబద్ధాలు చెప్పిన మంత్రి చేత ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయించేవారు. అవినీతికి కొమ్ముకాసిన అన్యాయవాది సిబ్బల్ ను మన్మోహన్ కానీ సోనియా కానీ మందలించిన దాఖలా లేదు. పైగా ప్రధాని ఆమోదంతోనే తాను అన్ని పనులూ చేశానంటూ రాజా బహిరంగంగా ప్రకటించినట్టే చెప్పారు. ప్రధాని లేదా కాంగ్రెస్ అధ్యక్షురాలు పురమాయిస్తేనే కపిల్ సిబ్బల్ సైతం జాతిని బుకాయించే ప్రయత్నం చేశారు. అవినీతిని కప్పిపుచ్చి జాతిని దబాయించే దుస్సాహసానికి ఒడిగట్టిన కపిల్ సిబ్బల్ చేతిలో టెలికాం శాఖ ఉండటం మాత్రం ఏమంత అభిలషణీయం? రాజా చేసిన నేరం ఏమీ లేదనీ, ప్రతిపక్షాల ఆరోపణ కారణంగానే రాజా రాజీనామా చేయవలసి వచ్చిందనీ సోనియా వ్యాఖ్యానించారు. టూజీ స్పెక్ట్రమ్ విషయంలో రాజా కానీ తాను కానీ ఎటువంటి నేరం చేయలేదని మన్మోహన్ చెప్పారు. సోనియా, మన్మోహన్, కపిల్ సిబ్బల్ చెప్పిందే నిజమైతే పాపం రాజాను ఎందుకు సీబీఐ అరెస్టు చేసినట్టు? అవకాశం ఉన్నంతవరకూ రాజా అండ్ కో అవినీతిని చాపకింద కప్పి పెట్టడానికే సోనియా అండ్ కో ప్రయత్నించినట్టు నిర్ద్వంద్వంగా స్పష్టం అవుతోంది. గత్యంతర లేకనే అరకొర చర్యలైనా అయిష్టంగా తీసుకుంటున్నారు. అపారమైన అవినీతి సొమ్ములో రాజా తిన్నది పది శాతం మాత్రమేనని ఈ కుంభకోణం వెలుగు చూడటానికి ప్రధాన కారకుడైన జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి అంటున్నారు. కరుణానిధికీ, సోనియా సోదరీమణులకూ అవినీతి సొమ్ములో భారీ వాటా ముట్టిందని కూడా డాక్టర్ స్వామి ఆరోపిస్తున్నారు. కనీసం ఈ ఆరోపణలలో సత్యం లేదని నిరూపించడానికైనా సమగ్రమైన దర్యాప్తుకోసం సోనియా పట్టుపట్టవలసింది. అది జరగడం లేదు. అన్నిటికీ మౌనమే సమాధానం. దొంగసొత్తు ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ దాగున్నదో తేలితే కానీ అసలు సూత్రధారులు ఎవ్వరో వెలుగులోకి రాదు.
రాజాను అరెస్టు చేశారు. సరే. ఆయన సోదరిడినీ, ఇతర బంధువులనూ, స్నేహితులను కూడా అదుపులోకి తీసుకోవచ్చు. డీఎంకే పార్టీ సభ్యత్వానికి రాజా చేత రాజీనామా ఇప్పించవచ్చు. ఇటువంటి పనులు ఎన్ని చేసినా అసలు కుంభకోణం మటుమాయం కాదు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపైన పడిన మచ్చ మాసిపోదు. ఈ కుంభకోణంలో రాజాకు ఎంత బాధ్యత ఉన్నదో, మంత్రిమండలి అధినాయకుడుగా ప్రధాని మన్మోహన్ సింగ్ కూ అంతే బాధ్యత ఉన్నదని వాదించడం తప్పు అవుతుందా? జయలలిత చెప్పినట్టు మానవేతిహాసంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగినప్పుడు అందుకు సంబంధించిన మంత్రిని బలి ఇస్తే సరిపోతుంది. ప్రధాన మంత్రి మూల్యం చెల్లించనక్కరలేదా? ఇది ఒక్కటే కాదు. కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి, ముంబయ్ ఆదర్శ్ సహకార సంఘం అవినీతి, ఇంకా అనేక అవినీతి కుంభకోణాలకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రధాన మంత్రికి నైతిక బాధ్యత బొత్తిగా ఉండదా? మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా మచ్చలేని మనిషి. కానీ అపచారం వల్లనో, గ్రహచారం వల్లనో ప్రధాన మంత్రిగా అనేక కుంభకోణాలకు బాధ్యత వహించవలసిన దుస్థితిలో పడిన వ్యక్తి. నైతిక విలువలు పాటించి పదవికి రాజీనామా చేస్తే మన్మోహన్ సింగ్ కు చరిత్రలో కొద్దో గొప్పో స్థానం ఉంటుంది. మొన్న ఏఐసీసీ సమావేశాలలో ప్రధాని ప్రసంగిస్తూ ‘సీజర్స్ వైఫ్ మస్ట్ బీ ఎబౌవ్ సస్పీషన్’ అంటూ ఉద్భోదించారు. అంటే సీజర్ భార్య అనుమానాలకు అతీతంగా ఉండాలని అర్థం. ఇది ప్రధాని మన్మోహన్ సింగ్ కి వర్తించినంతగా ప్రస్తుత సందర్భంలో మరెవ్వరికీ వర్తించదు. ఇంత జరిగిన తర్వాత మన్మోహన్ సింగ్ దేశంలోని అత్యున్నత పదవిలో కొనసాగడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఆయనకూ మంచిది కాదు. దేశానికీ మంచిది కాదు. మన్మోహన్ స్థానంలో ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీని నియమిస్తారో, పగ్గాలు కుమార రత్నానికి అప్పగిస్తారో సోనియాగాంధీ ఇష్టం.

Monday, January 31, 2011

కిరణ్ గుగ్లీ

ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్త బౌలర్ కిరణ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నారు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ సోనియాగాంధీ ఆదేశాలమేరకు లెగ్ బ్రేక్ ప్రవీణుడు కిరణ్ వరుసగా ఇబ్బందికరమైన బంతులు వేసి స్టార్ బ్యాట్స్ మన్ జగన్మోహన్ రెడ్డిని చీకాకు పెడుతున్నారు. లెగ్ బ్రేక్ తాపీగా వేస్తున్న కిరణ్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా, అనూహ్యంగా మణికట్టు గిర్రున తిప్పి గుగ్లీ వేశాడు. ప్రత్యర్థి దిమ్మరబోయారు.
బెర్నాడ్ బోసాంకే అనే క్రికెటర్ కనిపెట్టిన గుగ్లీ మహా కతర్ నాక్ బంతి. బ్యాట్స్ మన్ ని ఆశ్చర్య పర్చుతుంది. కంగారు పెడుతుంది. దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తుంది. పెవెలియన్ వైపు నడిపిస్తుంది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్లు ఈ బంతిని విసిరి బ్యాట్స్ మన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అస్థిరపర్చుతారు. మతిపోగొడతారు. రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ కి లెగ్ బ్రేక్ వేస్తే బంతి లెగ్ నుంచి ఆఫ్ సైడ్ కి, అంటే బ్యాట్స్ మన్ కి దూరంగా వెడుతుంది. గుగ్లీ ఇందుకు భిన్నంగా అడ్డం తిరుగుతుంది. బంతి ఆఫ్ సైడ్ లో పడి లెగ్ వైపు చప్పున తిరిగి అంతలోనే నేరుగా వేగంగా వికెట్ల మీదికి వెడుతుంది. బంతి ఎటు పోయి ఎటు వస్తుందో బ్యాట్స్ మన్ కి ఒక పట్టాన అర్థం కాదు. దీనిని బౌలర్ అమ్ములపొదిలో ఉన్న అత్యంత ప్రమాదరకరమైన అస్త్రంగా- మోస్ట్ లీతల్ వెపన్ గా, స్టెల్దియెస్ట్ వెపన్ గా - క్రికెట్ పండితులు అభివర్ణిస్తారు. పాతతరం క్రికెటర్లలో కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత బౌలర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియలో ప్రసిద్ధుడు. కొమ్ములు తిరిగిన అంతర్జాతీయ బ్యాట్స్ మన్ ను తన గుగ్లీతో గింగిరాలు తిరిగేట్టు చేశాడు. ఆధునిక క్రికెట్ లో అనీల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, అబ్దుల్ ఖాదర్, సక్లైన్ ముస్తాఖ్ వంటి క్రికెటర్లు గుగ్లీ ప్రవీణులు. గుగ్లీని ఆస్ట్రేలియాలో రాంగ్ వన్ అంటారు. పాకిస్తాన్ లో దూసరా అంటారు. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ వేసే బంతిని దూసరా అనడం పరిపాటి. దూసరా అంటే మరోబంతి అని భావన. అక్రమమైనదని అభియోగం. మొత్తంమీదికి గుగ్లీకి మంచిపేరు లేదు. ఊహించని రీతిలో గబుక్కున అడ్డంతిరిగి వికెట్ల మీదికి వెళ్ళే బంతి ఏ నేరం చేయని బ్యాట్స్ మన్ ని కంగారు పెట్టి అవుట్ చేస్తుంది కనుక గుగ్లీకి చెడ్డపేరే ఉంది. అందుకే రాంగ్ వన్ అనీ, బాసీ అని పిలవడం. బ్యాట్స్ మన్ అవుటు కాకుండా బాగా ఆడుతూ బౌలింగ్ ను అదే పనిగా బాదేస్తుంటే ఫీల్డింగ్ పక్షం కెప్టెన్ ఈ ప్రక్రియను తుర్ఫు ముక్కలాగా ప్రయోగించడం ఆనవాయితీ.
కిరణ్ కూడా మంచి క్రికెటర్. స్వయంగా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి పలు సందర్భాలలో విజయం సాధించిన క్రీడాకారుడు. అజరుద్దీన్ వంటి ప్రపంచ ప్రసిద్ధుడైన కెప్టెన్ కు కిరణ్ కెప్టెన్. కెప్టెన్ ఆఫ్ కెప్టెన్ అన్న మాట. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కంట్రోల్డ్ ఎగ్రెషన్... అంటే జాగ్రత్తగా ఆడుతూనే రిస్కు తీసుకొని ధాటిగా షాట్లు కొట్టడం తెలిసిన ఆటగాడు. ప్రత్యర్థిని అవుట్ చేయడానికి ఏమి చేయాలో కిరణ్ కు తెలుసు. ప్రత్యర్థి సైతం సామాన్యుడు కాదు. పిన్న వయస్కుడైనా సాహసోపేతమైన రీతిలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న క్రికెటర్. అతని సారథ్యంలో మ్యాచ్ గెలుస్తామనే ఆశతో చాలామంది క్రికెటర్లూ, ఔత్సాహిక క్రికెటర్లూ ఆయన జట్టులో చేరారు. మరికొంత మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
కిరణ్ జట్టు సారథ్యం స్వీకరించే సమయంలో జట్టు డీలాపడి ఉంది. ప్రత్యర్థి జట్టు మంచి ఫామ్ లో రెచ్చిపోతున్నట్టు కనిపించింది. సొంత జట్టులోని సభ్యుల విధేయతపైన కెప్టెన్ కు విశ్వాసం లేదు. డ్రసింగ్ రూమ్ లో చర్చించిన వ్యూహాన్ని క్షణాలలో ప్రత్యర్థికి అందించే సహచరులతో తల బొప్పికడుతోంది. మనువొకచోటా, మనసొకచోటా అన్నట్టు ఉన్నది వారి వాలకం. రోశయ్య కెప్టెన్ గా విఫలమైనారు కనుకనే తనకు ఈ బాధ్యత అప్పగించారని కిరణ్ కు తెలుసు. ఏదో ఒక హడావుడి చేసి సంచలనం సృష్టించి ప్రత్యర్థులను బలహీనపరచి సొంత జట్టులోని సభ్యులను ఉత్సాహపరచి ప్రజలను ఆకట్టుకోకపోతే పాత కెప్టెన్ లాగానే తాను సైతం పరాజితుడై పదవి కోల్పోవలసి వస్తుందని కిరణ్ కు తెలుసు. ఓటమి పొంచి ఉన్న సందర్భాలలో విజృంభించి ఆడటం ఒక్కటే మార్గమని క్రికెట్ క్రీడానుభవం నేర్పిన పాఠం. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం చూస్తున్న దృశ్యం అదే.
మంత్రులు కలసి రారని తెలిసినప్పటికీ, శాసనసభ్యులు గోడమీద పిల్లివాటంగా కపట విన్యాసాలు చేస్తున్నారన్న సమాచారం ఉన్నప్పటికీ కెప్టెన్ గా తాను చొరవ తీసుకొని వీరవిహారం చేయడం ప్రారంభించాలని కిరణ్ నిర్ణయించుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. సీమాంధ్రలో జగన్ అభిమానులూ, తెలంగాణలో తెలంగాణవాదులూ అడ్డుకుంటారనీ, రచ్చబండను రచ్చరచ్చ చేస్తారని తెలుసు. పోలీసు యంత్రాంగం సహకారంతో, కలసివచ్చే మంత్రులూ, శాసనసభ్యుల మద్దతుతో కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం కొనసాగించాలనే నిర్ణయించారు. కొనసాగిస్తున్నారు. తెలంగాణలో లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం వంటి చర్యలు అవసరమైనా వెనుకంజ వేయడం లేదు. రచ్చబండ కార్యక్రమం ప్రచారం పత్రికలలో, టీవీ చానళ్ళలో జోరుగా వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోట్లాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనారు. ఆయన మాట తీరు కూడా తెలుగువారికి అలవాటైపోయింది. సంవత్సరానికి పైబడి ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్యకు రాని ప్రచారం కిరణ్ కుమార్ రెడ్డికి వారం రోజులలోనే వచ్చింది. జగన్ శిబిరంలోకి వలసలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలికమే కావచ్చు. కాకపోవచ్చు. మొత్తంమీద పలుకున్న ఆటగాడినని నిరూపించుకునే ప్రయత్నం కిరణ్ చేస్తున్నారు. ఈ సానుకూలతను ఎట్లా ఉపయోగించుకుంటారన్న అంశంపైన కిరణ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
అన్నట్టు గుగ్లీ విషయం. రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 24 వ తేదీన విశాఖపట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనే కిరణ్ జగన్ పైన గుగ్లీ విసిరారు. అంతకు కొన్ని రోజుల కిందటే ఆ నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు జగన్ కు బ్రహ్మరథం పట్టారు. అక్కడే జగన్ పైన కిరణ్ శక్తిమంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ కు ప్రమేయం ఉందన్న ఆరోపణలను తెలుగు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. జగన్ పైన తెలుగుదేశం చేసిన ఆరోపణలను అసెంబ్లీలో ఎదుర్కొనే బాధ్యత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకే అప్పగించారని చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అరవై రోజుల పాటు తాను విషయాన్ని అధ్యయనం చేయవలసి వచ్చిందని తెలిపారు. జగన్ నిర్దోషి అని నిరూపించేందుకు అసెంబ్లీలో ఎట్లా వాదించబోతున్నావని అరవై రోజుల్లో ఒక్కసారి కూడా తనను వైఎస్ అడగలేదని బెబుతూ నాటి ముఖ్యమంత్రికి తనపైన అంతటి విశ్వాసం ఉన్నదని చాటుకున్నారు. అందువల్ల ఇరవై సంవత్సరాలు కలిసి నడిచిన తన వంటి రాజకీయ నాయకులే వైఎస్ కు నిజమైన రాజకీయ వారసులు కానీ జగన్ కానేకాదని తేల్చారు. రాజకీయ నాయకత్వం తనబోటి వాళ్ళదేనని చెప్పడం ఒక లక్ష్యం. అంతకంటే ముఖ్యమైన లక్ష్యం పరిటాల రవి హత్య కేసులో జగన్ కు పాత్ర ఉండి ఉండవచ్చుననే అనుమానాన్ని కలిగించే విధంగా స్పష్టాస్పష్టంగా చెప్పడం. కిరణ్ కుమార్ రెడ్డి ఇంత వ్యూహాత్మకంగా, ఇంత సాహసోపేతంగా, ఇంత నాటకీయంగా ప్రమాదపుటంచులపైన విన్యాసం చేయగలరని తెలుగు ప్రేక్షకులు బహుశా ఊహించి ఉండరు. షేక్ స్పియర్ రాసిన జూలియస్ సీజర్ నాటకంలో ఐ కమ్ టు బరీ సీజర్. నాట్ టు ప్రైజ్ హిమ్ అంటూ మహోపన్యాసం ప్రారంభించిన మార్క్ ఆంటనీ కిటుకునే కిరణ్ రివర్స్ లో ప్రయోగించారు. కిరణ్ విశాఖ ఉపన్యాసాన్ని లెగ్ బ్రేక్ లాగా కనిపించిన గుగ్లీ అనడం అందుకే. దీనికి ప్రతిగా జగన్ వర్గం విశ్వాస తీర్మానం డిమాండ్ తో బంతిని బౌండరీ దాటించింది. ఒక్క గుగ్లీతో బ్యాట్స్ మన్ అవుటై పోవాలని లేదు. ఇన్నింగ్స్ కుప్పకూలి పోవాలనీ లేదు. కానీ కిరణ్ వేసిన గుగ్లీ మాత్రం ప్రమాదకరమైనది. సందట్లో సడేమియా లాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్కోరు పెంచుకునే రంధిలో పడింది. కిరణ్ వ్యాఖ్యలను కొద్దిగా మార్చి వక్రభాష్యం చెబుతోంది. హత్య కేసులో జగన్ ను రక్షించినట్టు కిరణ్ చెప్పారని అంటూ అటువంటి పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండరాదంటూ చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నాయకులు డిమాండ్ చేయడం విడ్డూరం. జగన్ పైన తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీలో సమాధానం చెప్పడం గురించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తే హత్య కేసులో జగన్ ని రక్షించినట్టు ముఖ్యమంత్రి చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు వాదిస్తున్నారు. కిరణ్ వ్యాఖ్యలను వక్రీకరించి వర్థిల్లాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తంమీద జగన్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత ఎదుర్కొన్న అత్యంత నిశితమైన విమర్శనాస్త్రం రచ్చబండ ప్రారంభంలో కిరణ్ కుమార్ రెడ్డి వేసిన గుగ్లీ. విజేతలు ఎవరో ఇప్పుడే చెప్పలేము కానీ ఆట రసవత్తరంగా, ప్రేక్షకులను మునుగాళ్ళ మీద నిలబెట్టే విధంగా, గుండెల్లో రైళ్ళను పరుగెత్తించే రకంగా ఉంటుందని మాత్రం చెప్పగలం. మిగిలిన కథ తెలుగు టీవీ న్యూస్ చానళ్ళ తెరపై నిరవధికంగా చూడవచ్చు.
(ఈ వ్యాసాన్ని శ్రీ రామచంద్రమూర్తి గారు hmtv సంపాదకీయం “ హంసధ్వని” కోసం 30వ తేదీన రాశారు. మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com ని క్లిక్‌ చేయండి)

Tuesday, January 25, 2011

జాతికి తీరని అపచారం..!

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ నవయుగ వైతాళికుడు గురజాడ చేసిన ప్రబోధం విలువైనది. వెలలేనిది. ఈ ప్రబోధాన్ని ఎవరు విస్మరించినా అవివేకమే. ఆత్మహత్యాసదృశమే. ఏక్తా యాత్ర పేరుతో శ్రీనగర్ వెళ్ళి లాల్ చౌక్ లో గణతంత్ర దినోత్సవం నాడు త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలన్న భారతీయ జనతా పార్టీ యువజన విభాగం నాయకుల సంకల్పం ఆందోళన కలిగిస్తున్నది. కథ మళ్ళీ మొదటికి వస్తున్నందుకు ఖేదం కలుగుతున్నది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం దేశభక్తికి నిదర్శనం. భారత దేశంలో ఎక్కడైనా మూడురంగుల జెండాను ఎగువేసే స్వేచ్ఛ దేశప్రజలందరికీ ఉంది. ముఖ్యంగా కశ్మీర్ మిలిటెంట్లు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో పాకిస్తాన్ పతాకాన్ని ఎగురవేసిన లాల్ చౌక్ లో మూడు వన్నెల జెండాను ఎగురువేసి దేశభక్తిని చాటుకోవడంలో తప్పు లేదు. కశ్మీరీలు భారతీయులనీ, జమ్మూ-కశ్మీర్ భారత దేశంలో భాగమనీ చాటడానికి ఇది మంచి సందర్భం. ఇదీ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల వాదన.
కశ్మీర్ భారత్ లో భాగమని నిరూపించడం ఎట్లా? అంతర్జాతీయ వేదికలపైన నిరంతరం వాదించడం ద్వారానా? శ్రీనగర్ లో మట్టిని నెత్తిన పెట్టుకొని ఈ భూమి నాది, ఈ దేశం నాది అంటూ నినాదాలు చేయడం ద్వారానా? కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలను జాతికి తెలియకుండా దాచడం ద్వారానా? లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆగస్టు పదిహేనో తేదీనో, జనవరి ఇరవై ఆరవ తేదీనో ఎగురవేసి భారతమాతాకీ జై అంటూ నినదించడం ద్వారానా? కశ్మీర్ లో భారత దేశంలో భాగమనడానికి తిరుగులేని రుజువు ఏమిటి? ఏమి చేస్తే అటువంటి రుజువు లభిస్తుంది. భాజపా యువజన నేతలు పోలీసు బందోబస్తుతో శ్రీనగర్ వెళ్ళి లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తే కశ్మీర్ భారత దేశంలో విడదీయలేని భాగమని లోకం విశ్వసిస్తుందా? కశ్మీర్ భారత్ అంతర్భాగమని ప్రపంచం నమ్మాలంటే ఏమి చేయాలి? కశ్మీర్ లోయలోని ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్నీ, గణతంత్రదినోత్సవాన్నీ పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. ఐచ్ఛికంగా, ఆనందంగా, ఉత్సాహంగా లాల్ చౌక్ లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం మనసారా సగౌరవంగా ఆలపించాలి. అటువంటి శుభవేళకోసం దేశప్రజలు వేచి ఉండాలి. అటువంటి ఉత్కృష్టమైన సన్నివేశం ఆవిష్కృతం కావాలంటే భారతీయ జనతా పార్టీకి చెందిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజపేయి చూపించిన దారిలో ప్రయాణం చేయాలి.
హెచ్ ఎంటీవీ బృందం ఇటీవల కశ్మీర్ లో పర్యటించినప్పుడు అక్కడి ముఖ్యనాయకులనూ, సాధారణ ప్రజలనూ ఒక ప్రశ్న అడిగింది. భారత దేశాన్ని పరిపాలించిన ప్రధాన మంత్రులలో మీకు నచ్చిన ప్రధాని ఎవరన్నది ఆ ప్రశ్న. దాదాపు అందరు నాయకులూ ఒకే సమాధానం ఇచ్చారు. సాధారణ ప్రజలు అదే జవాబు చెప్పారు. హురియత్ నాయకులు సయ్యద్ అలీ షా గిలానీ, మీర్వాయిజ్ ఒమర్ ఫారూఖ్ నుంచి పీడీపీ నాయకుడు నయీమ్ అఖ్తర్ వరకూ మొదట జవహర్ లాల్ నెహ్రూ పేరు చెప్పి వెంటనే వాజపేయి పేరు చెప్పారు. సాధారణ పౌరులలో చాలామంది వాజపేయి పేరు మాత్రమే చెప్పారు. కశ్మీర్ లో వాజపేయి ప్రతిష్ఠ ఆశ్చర్యం కలిగించింది. రాజ్యాంగపరిధిలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామంటూ భారత ప్రధానులూ, విదేశాంగ మంత్రులూ, ఇతర నాయకులూ అరిగిపోయిన రికార్డులాగా చేసిన ప్రకటనలను పూర్వపక్షం చేశారు వాజపేయి. మానవత్వం పరిధిలో కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ అటల్ జీ చేసిన ప్రకటన కశ్మీర్ ప్రజల హృదయాలకు హత్తుకుంది. వాజపేయి కశ్మీర్ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన ప్రధానిగా జమ్మూ-కశ్మీర్ ను సందర్శించారు. ప్రజల బాధల గాధలు ఆలకించి చలించిపోయారు. కవిత్వ రూపంలో సానుభూతి తెలిపారు. సంఘీభావం ప్రకటించారు. ఒక మానవతావాదిగా కరడుగట్టిన కశ్మీరీ మిలిటెంట్లకు సైతం అర్థమైనారు. కశ్మీర్ ప్రజలలో ఒక ఆశను రేకెత్తించారు. అందమైన భవిష్య చిత్రాన్ని చూపించారు. అటువంటి విలువైన వాజపేయి వారసత్వాన్ని యమునానదిలో కలిపే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రస్తుత నాయకత్వం వ్యవహరిస్తోంది. వాజపేయి కశ్మీర్ విధానం అమలులో ఆయన కుడిభుజంగా, దేశీయాంగమంత్రిగా తనవంతు కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించిన లాల్ కృష్ణ అద్వానీ ఇప్పుడు వాజపేయి విధానానికి సమాధి కట్టడం అత్యంత బాధాకరం. బహుశా అందుకే అద్వానీ రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకోలేకపోయారు. వాజపేయి తర్వాత సమున్నత నాయకుడిగా దేశ ప్రజల అభిమానాన్నీ, పార్టీ కార్యకర్తల విశ్వాసాన్నీ అందుకే పొందలేకపోయారేమో. వాజపేయి వారసత్వాన్ని కొనసాగించి ఉంటే... అద్వానీ, ఇతర భాజపా నాయకులు దేశానికి గొప్ప సేవ చేసి ఉండేవారు. కశ్మీర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచేవారు. కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి దోహదం చేసేవారు. భారత ఉపఖండంలో శాంతి స్థాపనలో కీలకమైన భూమికను పోషించేవారు. భారత దేశ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటగలిగేవారు. ద్విజాతి సిద్ధాంతంలో పసలేదని మరోసారి నిరూపించగలిగేవారు.
నిరుడు వేసవిలో రాళ్ళు రువ్వుతున్న యువకులను సైన్యం కాల్చి చంపినప్పుడు భాజపా నాయకత్వం నిరసర ప్రకటించి ఉంటే బాగుండేది. నూటా పన్నెండు మంది యువకుల మృతికి దారితీసిన ఘటనలపైన పార్లమెంటులో చర్చకోసం పట్టుబట్టి ఉంటే ఒక జాతీయ ప్రతిపక్షంగా భాజపా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఉండేది. అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి వరిష్ఠ నాయకులు కశ్మీర్ లోయకు వెళ్ళి చనిపోయిన పిల్లల తల్లులనూ, ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించి ఉంటే కశ్మీర్ లోయలో ఒక మహత్తరమైన లౌకికవాతావరణం ఏర్పడి ఉండేది. వేసవి అల్లర్ల తర్వాత నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన యూపీఏ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చేది. కష్టాలలో ఉన్న కశ్మీరీలకు భాజపా నాయకులు సంఘీభావం ప్రకటించి ఉంటే గణతంత్ర దినోత్సవం నాడు భాజపా నాయకులతో కలిసి కశ్మీరీలు లాల్ చౌక్ లోనే జెండావందనం జరుపుకునేవారు. ఒక మంచి అవకాశాన్ని భాజపా నాయకులు చేజార్చుకున్నారు. ఒక మంచి వారసత్వాన్ని చేజేతులా వదులుకున్నారు. ఒక మంచి భవిష్యత్తును అవివేకంగా కాలదన్నుకున్నారు. దేశమంటే మనుషులనే విశ్వాసం ఉంటే భాజపా నాయకులు ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. కశ్మీర్ భూఖండం పైన ఉన్న ప్రేమ కశ్మీరీల పైన లేదు.
కశ్మీర్ ప్రజలు పరాయీకరణ చెందడానికి కారకులు ఎవరో భారతీయులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాము భారత దేశంలో భాగం కాదంటూ కశ్మీరీలు భావించడం సగటు భారతీయులకు మనోవేదన కలిగిస్తుంది. ఇది సహజం. భారత దేశంలో తాము భాగమని కశ్మీరీలు తలపోయడం లేదు సరే. మరి భారతీయుల మాటేమిటి? కశ్మీరీలు భారత దేశంలో భాగమని భారతీయులందరూ భావిస్తున్నారా? ఆ విధంగా భావిస్తుంటే కశ్మీర్ లో సైన్యం పదఘట్టనలో ప్రజలు నలిగిపోతుంటే. రాళ్ళు రువ్వుతున్న కుర్రాలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతుంటే పౌరసమాజం భారత స్పందించలేదు ఎందుకని? ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీరాయ్ కశ్మీర్ వెళ్ళి అక్కడి ప్రజల దుర్భర జీవితాల గురించి ప్రపంచానికి చాటే వరకూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనను ఎవ్వరూ ప్రశ్నించలేదు ఎందుకని? తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించకపోతే తెలంగాణలో హింసాకాండ జరుగుతుందనే భయంతో దేశీయాంగ మంత్రి తెలంగాణ విధానాన్ని హడావుడిగా అర్ధరాత్రి ప్రకటించారు. గుజ్జర్లు హింసాత్మక ఉద్యమం కొద్ది రోజులు నిర్వహించే సరికి ఉద్యమ నాయకులను సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. కానీ కశ్మీర్ సమస్య పరిష్కరానికి చర్చలు జరపాలంటూ ఎంతమంది నాయకులు విన్నపాలు చేసినా, ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా దేశ నాయకులు పట్టించుకోలేదు. సైన్యం నీడలో బతకలేమంటూ కశ్మీరీలు చేస్తున్న ఘోషను వినిపించుకునే నాధుడు లేడు. సైన్యాన్ని తగ్గిస్తామంటూ దేశీయాంగ కార్యదర్శి పిళ్ళై ప్రకటిస్తే అటువంటి అవకాశమే లేదంటూ మరునాడే రక్షణ మంత్రి పోటీ ప్రకటన చేశారు. సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టాన్ని సవరించాలని యోచిస్తున్నట్టు హోంమంత్రి చెబితే అటువంటి ప్రతిపాదనను తాను ఎన్నటికీ ఆమోదించేది లేదంటూ సైన్యాధిపతి వెంటనే స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలూ, చర్యలూ ఆనవాయితీగా మారాయి. భారత ప్రభుత్వానికి కశ్మీర్ వ్యవహారంలో ఒక విధానం అంటూ లేదనడానికి ఇది నిదర్శనం. మన్మోహన్ సింగ్ కు కానీ సోనియాకి కానీ దార్శనికత లోపించిందనడానికి ఈ పరిణామాలే సాక్ష్యం. నిజానికి యూపీఏ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వాజపేయి వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం నిజాయితీగా చేసినట్టు కనిపించింది. శ్రీనగర్, ముజాఫరాబాద్ మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించడంలో యూపీఏ సర్కార్ పట్టుదలగా వ్యవహరించింది. మిలిటెంట్ల బెదిరింపులకు లొంగకుండా గట్టిగా నిలిచింది. ఆ తర్వాత హురియత్ నాయకులతో చర్చలకోసం మన్మోహన్ సింగ్ తీసుకున్న చొరవ ఫలించలేదు. ఢిల్లీలో, శ్రీనగర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలను హురియత్ నాయకులలో అత్యధికులు బహిష్కరించారు. అంతటితో మన్మోహన్ ఆగిపోయారు. కశ్మీర్ లో పరిస్థితులు క్రమంగా దిగజారాయి. నిరుడు వేసవి పరిణామాల తర్వాత పార్లమెంటు సభ్యలు బృందాన్ని తీసుకొని హోంమంత్రి చిదంబరం కశ్మీర్ లో పర్యటించారు. అప్పుడు శ్రీనగర్ పౌరులు మెత్తబడినట్టు కనిపించారు. అఖిలపక్ష బృందం పర్యటన తర్వాత మరో ఉన్నత స్థాయి బృందాన్ని పంపించి చర్చలు ప్రారంభించి ఉంటే పరిస్థితి సానుకూలంగా మారేదేమో. ఆ పని చేయకుండా ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పాడ్గాంకర్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించడం శాంతిప్రియులకు నిరాశ కలిగించింది. ఈ బృందం సభ్యుల వ్యక్తిగత చొరవతో, సుహృద్భావంతో కొంతమందిని కలుసుకొని మాట్లాడగలిగారు. కానీ ప్రయోజనం పరిమితం. కశ్మీర్ సమస్య అత్యంత జటిలమైనది. ఒక వైపు భారత ప్రభుత్వాల వరుస తప్పిదాలు. మరో వైపు పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదుల అగడాలు. ఇంకోవైపు కశ్మీరీ నాయకుల కపట ధోరణి. నాలుగో అంశం పాకిస్తాన్ మొడితనం. పీటముడి పడిన కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటే అపారమైన నేర్పూ, ఓర్పూ కావాలి. అద్వానీ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు ఈ వ్యవహారంలో ఈ దశలో చొరవ తీసుకొని ఉంటే, భారత రాజకీయ నాయకత్వానికి దారి చూపించి ఉంటే చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకునేవారు. ఆ పని చేయకుండా శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురవేయడాన్ని ఒక వివాదం చేసి అందులో వర్థిల్లాలని, దేశభక్తిని రాజకీయ లబ్ధికి వినియోగించుకోవాలనీ విఫలయత్నం చేయడం విషాదం. వాజపేయి సజీవంగా ఉండగానే ఆయన వారసత్వాన్ని మంటకలపడం క్షంతవ్యం కాని నేరం. ఏక్తా యాత్ర పేరుతో అనైక్యతకు బాటలు వేయడం జాతికి చేస్తున్నతీరని అపచారం.
(హంసధ్వని- 25-01-2011)

Sunday, January 23, 2011

జగన్‌ ఓటమా..? నరసింహన్‌కి రాజదండమా..?

ముసుగులు గబగబా తొలగిపోతున్నాయి. ఒరలలో నుంచి బరబరా బయటికి దూసిన కత్తులు తళతళా మెరుస్తున్నాయి. కుత్తుకలు కత్తిరించడానికి సిద్ధం అవుతున్నాయి. వాతావరణం అమాంతంగా వెడెక్కిపోతున్నది. యుద్ధానికి ఉభయ పక్షాలూ సై అంటున్నాయి. రాబోయే కాలంలో రాజకీయ పోరాటం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికీ మధ్యనే ప్రధానంగా. మూడో పక్షం కొంత తగ్గవలసి వస్తుంది. తెలుగు దేశం అధినేత చంద్రబాబు చాలా శ్రమిస్తున్నారు. కష్టానికి తగిన ఫలితం వెంటనే రాకపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు చాలా ఆలోచిస్తున్నారు. ఉద్యమంలో కాస్తంత విలంబన పాటించవలసి రావచ్చు. రాష్ట్రంలో రసవత్తరంగా జరగబోయే కోడిపందెం ఫలితం తేలిన తర్వాత కొన్ని ప్రశ్నలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుచూపు మేరలో కనిపిస్తాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తవుల ధరలూ, రైతుల కష్టనష్టాలూ వంటి సమస్యలకు పరిష్కారం గురించి ఆలోచించే వ్యవధి ఏలినవారికి ఉండదు.

సంక్రాంతికి బాగా ముందుగానే కాంగ్రెస్ అధిష్ఠానం కోడి పందాలకు రంగం సిద్ధం చేసింది. పౌరుషం అధికంగా ఉన్న జగన్ అనే పోరు కోడి అదేపనిగా కాలుదువ్వడాన్నీ, ధిక్కారపు కూతలు కూయడాన్నీ సహించలేకపోయిన అధిష్ఠాన దేవత పోటీ కోడిని దగ్గరికి తీసుకొని దువ్వి, పోరు పాఠాలు చెప్పి మరీ రంగంలోకి దించింది. అదే ప్రాంతానికీ, అదే జాతికీ చెందిన దాదాపు అదే వయస్సు కోడిని గుర్తించి పోటీకి నిలిపినందుకు అధిష్ఠానం తనను తాను అభినందించుకున్నది. కడప కోడి ఆట కట్టిస్తానంటూ పీలేరుకు చెందిన కొత్త కోడి ఇచ్చిన హామీని ఢిల్లీ రాజకీయ జూదరులు విశ్వసించారు. జగన్ బెడద త్వరలోనే తొలగిపోతుందని అధిష్ఠానం తలపోసింది. కానీ కొత్త కోడి బరిలోకి దిగడానికి మీనమేషాలు లెక్కించింది. ముక్కుకూ, కాళ్ళకూ కత్తులు కట్టుకొని పోరాటం ప్రారంభించేందుకు అవసరానికి మించిన సమయం తీసుకుంది. ఇంతలో అధిష్ఠాన దేవతకు అనుమానం వచ్చింది. సర్కారు కోడికి పౌరుషం ఉన్నదా లేదా అన్న ప్రశ్న ఉదయించింది. గుండెబలం లేదేమోనన్న సందేహం కలిగింది. హస్తినకు పిలిపించింది. రెండు మాసాల కిందట ఇచ్చిన హామీని గుర్తు చేసింది. కర్తవ్యాన్ని తిరిగి ప్రబోధించింది. ధైర్యం నూరిపోసింది. పోరు వెంటనే ప్రారంభించాలనీ, చావో రేవో తేల్చుకోవాలనీ కరాఖండిగా చెప్పింది. కడప కోడి శృంగనాదం చేసిన హస్తినలోనే సర్కార్ కోడి కూడా శంఖం పూరించాలని పట్టుపట్టింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపైన ధ్వజమెత్తారు. మొట్టమొదటి సారిగా ప్రత్యక్షంగా మాటల తూటాలు పేల్చారు. జగన్ వెంట తిరుగుతున్న కాంగ్రెస్ శాసనసభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలంటూ హితవు చెప్పారు. ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అన్నట్టు జగన్ అనుయాయులు తక్షణమే తిరుగుదాడి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జిల్లా చిత్తూరుకే చెందిన సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు కుతూహలమ్మ మరోసారి కదన కుతూహలం ప్రదర్శించారు. మంత్రిపదవి రాలేదని కోపగించిన కుతూహలమ్మ కిరణ్ కుమార్ రెడ్డికి అటువంటి వ్యాఖ్య చేసే అర్హతే లేదంటూ విమర్శించారు. మంత్రి పదవి పోయిందని కృద్ధుడైన కురువృద్ధుడు గాదె వెంకటరెడ్డి ముఖ్యమంత్రి తొందరపడ్డారంటూ తప్పుపట్టారు. జగన్ ను విమర్శిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జగన్ ను అనుసరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారంటూ అంబటి రాంబాంబు వంటి జగన్ వర్గీయులు బదులిచ్చారు. వేడిలో వేడిగా వైఎస్ కుటుంబానికి కోట వంటి పులివెందులలో రచ్చబండ కార్యక్రమం జరిపించేందుకు ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శత్రు దుర్గాన్ని ముట్టడించడానికి ముఖ్యమంత్రి సాహసిస్తున్నారని అనుకోవాలి. మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారని భావించాలి.
నిధులు లేక బొక్కసం నిండుకున్నప్పటికీ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్న ముఖ్యమంత్రి తాపత్రయం ప్రజలకు ఏదో ఒక విధంగా దగ్గర కావాలనే. వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా సంక్షేమ పథకాల దన్నుతో ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకోవాలన్నది కిరణ్ దీర్ఘ కాలిక వ్యూహం కావచ్చు. కానీ రచ్చబండ ప్రారంభం కావడానికి ముందే జగన్మోహన్ రెడ్డితో అమీతుమీ తేల్చుకోవాలని అధిష్ఠానం ఒత్తిడి తేవడంతో కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధప్రణాళికలో స్వల్పంగా సవరణలు చేసుకోవలసి వస్తున్నది. జగన్ ఆట కట్టిస్తానంటూ అధిష్ఠానవర్గానికి వాగ్దానం చేసి... ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కిరణ్ ప్రమాణస్వీకారం తర్వాత ఒకసారి ఫోన్ చేసి జగన్ ను పలకరించడం మినహా యువనాయకుడితో సయోధ్యకోసం ప్రత్యేకించి ప్రయత్నించిన దాఖలా లేదు. జగన్ ను బలహీనపరచడానికి తీసుకున్న అరకొర చర్యలు సైతం సత్ఫలితాలు ఇవ్వలేదు. విజయవాడ దీక్షకు కానీ, ఢిల్లీ ప్రదర్శనకు కానీ, విశాఖపట్టణం నిరశన వ్రతానికి కానీ హాజరు కారాదంటూ కిరణ్ చెప్పిన హితవును దాదాపు పాతిక మంది కాంగ్రెస్ శాసనసభ్యులూ పెడచెవిన పెట్టారు. జగన్ ను అనుసరిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరగకుండా చూసుకుంటూ మిగిలినవారిని పిలిపించి మాట్లాడుతున్నారు. నరుడా ఏమి నీ కోరిక అన్న పద్ధతిలో అడుగుతున్నారు. ఒకవైపు శాసనసభ్యలను బుజ్జగించి మంచి చేసుకుంటూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజలలోకి వెళ్ళాలనీ, ప్రజామోదం పొందాలనీ కిరణ్ కుమార్ రెడ్డి తలపోశారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడవద్దంటూ, జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవద్దంటూ శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి సలహా చెబుతున్నట్టు అధిష్ఠానవర్గానికి సమాచారం అందింది. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వంటి రాజీవ్ కుటుంబ విధేయులూ, అనుభవజ్ఞులైన పార్లమెంటు సభ్యులూ లేఖల ద్వారానూ, మౌఖికంగానూ అందించిన సమాచారం అధిష్ఠానదేవతకు ఆగ్రహం కలిగించింది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులైన ముఖ్యనాయకులు సోనియా సమక్షంలో రెండు గంటల పాటు రాష్ట్ర వ్యవహారాలపైన సమాలోచన జరిపినట్టు వార్త వచ్చింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైనా, రాష్ట్ర భవిష్యత్తుపైనా సుదీర్ఘ చర్చలు జరిగి ఉంటాయని అందరూ భావించారు. అనంతర పరిణామాలను గమనిస్తే కోర్ కమిటీ చర్చ ప్రధానంగా జగన్ తిరుగుబాటును ఎట్లా అణచివేయాలన్న అంశంపైనే జరిగినట్టు కనిపిస్తోంది.

తుదకంటా పోరాడాలన్నదే అధిష్ఠానం నిర్ణయం. జగన్ అనుయాయులపైన చర్య తీసుకోవడమే అభిమతం. చేతనైతే ప్రభుత్వాన్ని పడగొట్టమంటూ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ జగన్ ను సవాలు చేయడం సైతం ఆయన స్వయంగా చేసిన పని కాకపోవచ్చు. అధిష్ఠానం ప్రణాళికలో భాగమే కావచ్చు. జగన్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని చీల్చితే ప్రజారాజ్యం సభ్యలను ప్రభుత్వంలో చేర్చుకోవాలన్నది నిర్ణయం. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అటువంటి శుభసంకేతం కోసం శతసహస్ర నయనాలతో ఎదురు చూస్తున్నారన్నది ప్రజాభిప్రాయం. అప్పటికీ చాలకపోతే మజ్లీస్ మిత్రులు జో హుకుం అంటూ ఉండనే ఉన్నారు. జగన్ పట్ల శాసనసభ్యుల విధేయత ఊహించనంతగా పెరిగితే, ప్రజారాజ్యం, ఎంఐఎం మద్దతు సైతం పరిపోక ప్రభుత్వం పడిపోయే పరిస్థితే వస్తే రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించడానికి గవర్నర్ నరసింహన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నెల ప్రథమార్థంలోనే ఆయన రెండు సార్లు హస్తిన వెళ్ళివచ్చారు. నిరుడు అనేక పర్యాయాలు ఢిల్లీ పోయివచ్చారు. సోనియాను సందర్శించారు. నిజానికి ఆయన రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణం చేసినప్పటి నుంచే పరిపాలనా బాధ్యతలకోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఖాయం కావడంలో నరసింహన్ పాత్ర సైతం ఎంతో కొంత ఉంది. జగన్ వ్యవహారాన్ని రోశయ్య లాగా నాన్చకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న అధిష్ఠానం సంకల్పానికి అనుగుణంగా ఈ మార్పులు జరుగుతున్నాయి. జగన్ పరాజయమో, నరసింహన్ కు రాజదండం అప్పగించడమో తేలిపోవాలన్నది ఢిల్లీ పెద్దల పట్టుదలగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తిగా మద్దతు ఇవ్వడం, జగన్ ను పూర్వపక్షం చేయడంలో ముఖ్యమంత్రి విఫలమైతే, ప్రభుత్వ నిర్వహణ సజావుగా సాగకపోతే రాష్ట్రపతి పాలన విధించి శాసనసభను సుప్తావస్థలో ఉంచడం కాంగ్రెస్ నాయకత్వం వ్యూహం. తెలంగాణ ఉద్యమం, జగన్ రాజకీయం అనే రెండు బెడదలకూ ఇది తాత్కాలిక పరిష్కారం అవుతుందనీ, పరిస్థితులు కుదురుకున్న తర్వాత రెండు సమస్యల శాశ్వత పరిష్కారంకోసం తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించవచ్చుననీ భావన.
హంసధ్వని 23-01-2011

Thursday, January 13, 2011

బోఫోర్స్ : మన్మోహన్‌ వ్యక్తిత్వంపై మరో మరక

బోఫోర్స్ భూతం మరోసారి నిద్రలేచి వికటాట్టహాసం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని నిద్రకు దూరం చేస్తోంది. అధినాయకురాలి ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ముంచుకొస్తోంది. మచ్చలేని నీతిమంతుడుగా ఇంతకాలం పేరు నిలబెట్టుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వంపైన మరో మరక పడుతోంది. స్వయంగా అవినీతికి ఒడిగట్టకపోయినప్పటికీ అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న ప్రధానిగా మన్మోహన్ ను చరిత్ర బోను ఎక్కించనున్నది. దేశంలో అత్యున్నత పరిశోధన సంస్థ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పాలకుల చేతిలో ఆయుధమని ఇంకోసారి నిరూపించుకున్నది. నేరపరిశోధన చేయకుండా, అధికార పార్టీ లేదా అధికార కూటమి ప్రత్యర్థులను వేధించడానికీ, అస్మదీయులను రక్షించడానికీ అక్రమంగా పనిచేస్తున్న జేబు సంస్థగా తాజా ముద్ర వేయించుకున్నది.
సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడైన ఇటాలియన్ వ్యాపారి అట్టావియో కత్రోకీకి బోఫోర్స్ ముడుపులు ముట్టినట్టు ఇన్ కంటాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఈ నెల 3వ తేదీన ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. కత్రోకీకీ, సోనియా కుటుంబానికీ సంబంధాలు లేవంటూ బుకాయించడానికి దిగ్విజయ్ సింగ్, వీరప్పమొయిలీ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఆడుతున్న నాటకాన్నే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడూ ప్రదర్శిస్తున్నది. ఐటీఏటీలో నిజాయితీపరులు లేకపోతే కత్రోకీ నిర్దోషిగా బయటపడేవాడు. బోఫోర్స్ కుంభకోణం కారణంగానే 1989లో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ కారణంగానే విశ్వనాథ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రధాని కాగలిగారు. వీపీ సింగ్ కానీ ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రశేఖర్ కానీ, పీవీ నరసింహారావు కానీ, దేవెగౌడ, గుజ్రాల్ కానీ, అటల్ బిహారీ వాజపేయి కానీ, మన్మోహన్ సింగ్ కానీ బోఫోర్స్ గుట్టు రట్టు చేయలేకపోయారు. బోఫోర్స్ కుంభకోణంలో కత్రోకీతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న విన్ చఢాను దోషిగా నిర్ధారించడాన్ని ప్రభుత్వాలు అనుమతించాయి కానీ కత్రోకీకి మాత్రం రాచమర్యాదలు చేశాయి. అతగాడిమీద ఈగ కూడా వాలకుండా సీబీఐని కట్టడి చేశాయి. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలియకుండా మాయ చేశాయి. బోఫోర్స్ కేసులో కీలకమైన పరిశోధన చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్ జోగీందర్ సింగ్ ఈ విషయంలో విసిగి వేసారిపోయాడు. ‘సీబీఐ స్వతంత్ర సంస్థ అని ఎవరు చెప్పారు? అది ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ సంస్థ అప్పీలు పిటిషన్ సైతం దాఖలు చేయజాలదు. బోఫోర్స్ కేసులో అదే జరిగింది. మూడు సందర్భాలలో కోర్టు ఆదేశాన్ని సవాలు చేయడానికి ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేయలేదు. ఈ కేసును పద్ధతి ప్రకారం ధ్వంసం చేశారు’ అంటూ ఇటీవల ఒక ఇంటర్వూలో ఆవేదన వెలిబుచ్చాడు జోగీందర్ సింగ్. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు తీసుకురావడానికి జోగీందర్ స్వయంగా స్విట్జర్లాండ్ లోని బెర్న్ వెళ్ళివచ్చాడు. కత్రోకీకి ముడుపులు ముట్టాయని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ఆయన వాదిస్తున్నాడు. రాజీవ్ ప్రధానిగా ఉండగా కత్రోకీ, ఆయన భార్య మారియా ప్రధాని అధికార నివాసానికి తరచుగా వచ్చేవారనీ, రాజీవ్ మరణం తర్వాత కూడా కత్రోకీ సోనియాగాంధీని ఇరవై ఒక్క సార్లు కలుసుకున్నాడనీ సీబీఐ నమోదు చేసిన వాగ్మూలంలో కత్రోకీ డ్రైవర్ శశి ధరణ్, సోనియా అంగరక్షకుడు నరేష్ చంద్ర గోసాయిన్ వెల్లడించారు. బోఫోర్స్ కేసు విచారణ జరుగుతున్న కాలంలోనూ కత్రోకీ కుటుంబం సోనియా కుటుంబం మధ్య రాకపోకలు సాగాయి. సోనియా తల్లి సావొలా మెయినోతోనూ, సోదరి మరౌచ్కాతోనూ కత్రోకీకి సన్నిహిత సంబంధాలు ఉండేవని కూడా సీబీఐ దర్యాప్తులో తేలింది. సమస్త సమాచారం ఉన్నప్పటికీ కత్రోకీని నిలదీయకుండా దేశం నుంచి వెళ్ళిపోవడానికీ, లండన్ బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడానికీ అవకాశం కల్పించింది సీబీఐ. కత్రోకీపైన కేసు మూసివేయడానికి సన్నాహాలు జరుగుతుండగా బోఫోర్స్ భూతం వెకిలిగా నవ్వింది. ఇటాలియన్ మధ్యదళారీ కత్రోకీ 41కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయంటూ ఐటీఏటీ 22 సంవత్సరాల విచారణ తర్వాత మొన్న జనవరి 4న నిర్థారించింది. ఈ ముడుపులలో కొంత భాగాన్ని పనామాలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్టు కూడా ఆదాయం పన్ను వ్యవహారాల ఉన్నత సంస్థ స్పష్టం చేసింది. ఈ బ్యాంకు ఖాతా సోనియాగాంధీ కుటుంబ సభ్యులదంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తున్నది. ఈ ఆరోపణ న్యాయస్థానాలలో రుజువు కాకపోవచ్చు. సోనియాను కానీ ఆమె తోబుట్టువులను కానీ దోషులుగా నిర్ధారించలేకపోవచ్చు. కానీ చెరిగిపోయిందనుకున్న బోఫోర్స్ మచ్చ మళ్ళీ అకస్మాత్తుగా బయటపడి వికృతంగా కనిపిస్తోంది. నెహ్రూ-గాంధీ వంశంలో నాలుగో ప్రధానిగా రాహుల్ ను గద్దెనెక్కించడమే పరమావధిగా జీవిస్తున్న సోనియాపైనే ఆరోపణల మేఘాలు కమ్ముకుంటే, ప్రజల హృదయాలలో ఆమెపైన గౌరవం తగ్గిపోతే కాంగ్రెస్ కు తిరిగి రెండు వందల పైచిలుకు లోక్ సభ సీట్లు దక్కడం, యూపీఏ కూటమి మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దానికి రాహుల్ నాయకత్వం వహించడం సాధ్యమా? కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, టూజీ స్పెక్ట్రమ్ మహాకుంభకోణం చాలవన్నట్టు బోఫోర్స్ భూతం అమాంతంగా కాంగ్రెస్ అధిష్ఠానం నెత్తినెక్కి నాట్యం చేస్తోంది. సోనియాకూ, రాహుల్ కూ, వారిద్దరిపైనే ఆధారపడిన కాంగ్రెస్ కూ కష్టకాలం దాపురించిందనుకోవాలి.
ఇక నీతిమంతుడుగా, నిజాయితీపరుడుగా ఇంతకాలం ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న మన్మోహన్ పరిస్థితి మరీ దయనీయం. కత్రోకీపైన కేసును నీరు కార్చే ప్రక్రియను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పర్యవేక్షించడం వల్ల ఆయన ఈ వ్యవహారంలో తప్పుకోవడానికి అవకాశం లేదు. సాక్ష్యాధారాలు లేని కారణంగా కత్రోకీ ప్రాసిక్యూషన్ ను విరమించుకుంటున్నట్టు 2009 సెప్టెంబరులో మన్మోహన్ సింగ్ సర్కార్ సుప్రీంకోర్టుకు చెప్పింది. వాజపేయి ప్రధానిగా ఉండగా 2003లో ప్రభుత్వం ఒత్తిడి కారణంగా లండన్ లో కత్రోకీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు. 2006లో మన్మోహన్ ప్రధానిగా ఉండగా ఆంక్షలు ఎత్తివేసి లండన్ బ్యాంక్ ఖాతాకు తిరిగి ప్రాణం పోసింది. ఆ ఖాతా నుంచి కత్రోకీ 21కోట్ల రూపాయలు తీసుకోవడానికి వీలు కల్పించింది. కత్రోకీపైన రెడ్ కార్నర్ నోటీసును ఉపసంహరించుకోవలసిందిగా సీబీఐకి 2008 అక్టొబర్ లో నాటి అటార్నీ జనరల్ మిలన్ బెనర్జీ సలహా ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదం లేకుండా జరిగేవి కావు. పనామా బ్యాంకు ఖాతా ఎవరిదో సీబీఐకి తెలుసు. ప్రధానికి తెలుసు. కానీ కోర్టులకు తెలియదు. ప్రజలకు తెలియదు. కత్రోకీకి ముడుపులు చెల్లించిన మాట నిజమంటూ ట్రిబ్యూనల్ ప్రకటించిన తర్వాత కత్రోకీని రక్షించడానికీ, దేశం నుంచి సురక్షితంగా సాగనంపడానికీ, అతడు ముడుపుల సొమ్మును బ్యాంకు నుంచి తీసుకోవడానికీ, అతనిపైన కేసు ఎత్తివేయడానికీ సహకరించిన ప్రభుత్వం అప్రతిష్ఠపాలు కాకుండా ఉంటుందా? ప్రభుత్వాన్ని నడుపుతున్న మన్మోహన్ సింగ్, ఆయనను నడుపుతున్న సోనియాగాంధీ పట్ల ప్రజల విశ్వాసం కొనసాగుతుందా?
ఉన్నత స్థాయిలో ఉన్న ఇద్దరు నేతలతో పాటు ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ సైతం అప్రతిష్ఠపాలు కావడం విశేషం. బోఫోర్స్ కుంభకోణంలో కత్రోకీని రక్షించడానికీ, పనామా బ్యాంకు ఖాతాదారుల వివరాలు గోప్యం ఉంచడానికీ ప్రయత్నించి విశ్వసనీయతను కోల్పోయిన సీబీఐ మరికొన్ని కేసులలో కూడా ప్రభుత్వానికీ, పాలకవర్గానికీ లొంగి దర్యాప్తు చేయకుండా వాస్తవాలను సమాధి చేసింది. ఆరుషి, హేమరాజ్ హత్య కేసు, రుచిక గిర్హోత్రా ఆత్మహత్య కేసు, 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్ పాత్రను నిర్ధారించే కేసు వంటి కేసులలోనూ సీబీఐ పాత్ర శోభాయమానంగా లేదు. జుగుప్సాకరంగా, అవమానకరంగా ఉంది. ఆరుషి హత్య కేసులో హంతకులను పట్టుకోకపోగా దంతవైద్యుడు తల్వార్ కుటుంబాన్ని అనవసరంగా బజారుకు ఈడ్చి సీబీఐ అదనంగా అపకీర్తి మూటకట్టుకుంది. బహుజన సమాజ్ నేత మాయావతినీ, సమాజ్ వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ నీ, జనతాదళ్ నాయకుడు లాలూప్రసాద్ నీ బెదిరించి లొంగదీసుకోవడానికి సీబీఐని ఒక సాధనంగా యూపీఏ నాయకత్వం వినియోగించుకుంటున్నది. యూపీఏకి విధేయంగా ఉన్నంత కాలం మాయావతిపైన కేసులు కానీ ములాయంపైన కేసులు కానీ లాలూపైన కేసులు కానీ ముందుకు సాగవు. యూపీఏ తో విభేదించి ప్రతిపక్ష శిబిరంలో చేరిన వెంటనే వారిపై కేసులు మళ్ళీ మొదలవుతాయి. ఈ బాగోతాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. విదేశీ జర్నలిస్టులు, రచయితలు సైతం సీబీఐ నిర్వాకంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. సీబీఐని భ్రష్టుపట్టించిన ఘనత కూడా యూపీఏ సర్కార్ కే దక్కుతుంది.
అవినీతిని అరికట్టవలసిన యూపీఏ అధ్యక్షురాలు, ప్రధాని, సీబీఐ అవినీతితో రాజీపడితే ఈ దేశానికి నిష్కృతి ఉంటుందా? అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ‍యూపీఏ సర్కార్ ను సరైన మార్గంలో నడిపించగలుగుతుందా? టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణకు పార్లమెంటు సంయుక్త సంఘాన్ని-జేపీసీని- నియమంచడానికి అంగీకరించకపోతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయా? ఈ పరిస్థితులు మధ్యంతర ఎన్నికలకు దారి తీస్తాయా? మధ్యంతర ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు మెజారిటీ రాదని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. యూపీఏ సర్కార్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలనే అస్త్రాలుగా చేసుకొని ప్రచార యుద్ధం సాగించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఇటీవల గువాహతి సమావేశంలో నిర్ణయించింది. ఏ కోణం నుంచి చూసినా కాంగ్రెస్ కు పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. బోఫోర్స్ భూతం మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించనున్నదా? రాజీవ్ గాంధీని గద్దె దింపిన బోఫోర్స్ భూతం ఆయన కుమారుడు రాహుల్ 2014లో అనుకున్న ప్రకారం గద్దెనెక్కకుండా అడ్డుపడుతుందా?

Friday, January 7, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పర్యవసానాలు ఏంటి..?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడయింది. యథాతధస్థితిని కొనసాగించడం ఇకమీదట సాధ్యం కాదని నివేదిక ప్రారంభంలోనే కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఆరు సూచనలను చేసింది. ఆరు ప్రత్యామ్నాయాలనూ వివరించింది. ప్రతి సూచనపైనా తన వ్యాఖ్యలు చేసింది. ఆరు ప్రతిపాదనలు చేసినప్పటికీ మొదటి మూడు ప్రతిపాదనలనూ అమలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. చివరి మూడు ప్రతిపాదనలనే పరిశీలించాలన్నది కమిటీ అభిమతం. అందులోనూ హైదరాబాద్ చుట్టూ నాలుగు జిల్లాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించాలన్న సరికొత్త సూచనను తెలంగాణవాదులు గట్టిగా ప్రతిఘటిస్తారని కమిటీనే చెప్పింది. మిగిలినవి అయిదో సిఫార్సు, ఆరో సిఫార్సు. ఆరో సిఫార్సుకు కమిటీ అగ్రతర ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణ సామాజికార్థికాభివృద్ధికి అవసరమైన హామీలను రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలనీ, తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలన్నది శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను అసాధ్యమని భావిస్తే, రాష్ట్ర విభజన అనివార్యమైతేనే అయిదో ప్రతిపాదన పరిశీలించాలని కూడా కమిటీ చెప్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సహితంగా ఏర్పాటు చేయాలనీ, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించాలన్నది అయిదో సిఫార్సు. ఈ ప్రతిపాదనకు మూడు ప్రాంతాల ప్రజలనూ ఒప్పించాలని మెలిక పెట్టింది. మూడు ప్రాంతాల ప్రజలూ రాష్ట్ర విభజనకు అంగీకరించడం జరగని పని. కమిటీ చేసిన ఆరు సూచనలతో పాటు సుదీర్ఘమైన నివేదికలో అనేక వ్యాఖ్యలు చేసింది. నిశితంగా పరిశీలిస్తే చాలా వ్యాఖ్యల పట్ల అన్ని ప్రాంతాలవారికీ అభ్యంతరాలు ఉంటాయి.

ఏ ప్రాంతం ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో తెలుసుకొని నివేదిక రాయడానికి మాజీ న్యాయమూర్తులూ, మాజీ ఐఏఎస్ అధికారులూ, అధ్యాపక ప్రముఖులూ అక్కరలేదు. ఢిల్లీ నుంచి పనికట్టుకొని రానక్కరలేదు. హెచ్ఎంటీవీ హైదరాబాద్ లోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏడు మాసాలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ దశ-దిశ కార్యక్రమాలను ఢిల్లీలో కూర్చొని వీక్షించి ఉంటే ఇంతకంటే మెరుగైన నివేదిక ఇవ్వగలిగేవారు. దశ-దిశ కార్యక్రమాలలో సుమారు పదివేల మంది పాల్గొన్నారు. పదిహేను వందల మంది తమ అభిప్రాయాలను స్వయంగా వ్యక్తం చేసి రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ లక్షలాదిమంది హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వినిపించారు. ఇంతమందిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సంవత్సరం కాలంలో కలిసి ఉండరు. ఇన్ని అభిప్రాయాలు సేకరించి ఉండరు. పైగా దశ-దిశ కార్యక్రమాల డీవీడీలను కమిటీ కార్యదర్శి దుగ్గల్ మహాశయుడికి సమర్పించాం. దశ-దిశ కార్యక్రమం తమ పనిని సులువు చేసిందని కూడా ఆయన ఢిల్లీ మీడియా సమావేశంలో అభినందించారు. ఏ ప్రాంతం ప్రజలలో అధిక సంఖ్యాకులు ఏమి అనుకుంటున్నారో తెలియజేయడమే శ్రీకృష్ణ కమిటీ లక్ష్యం అయినట్లయితే ఇంత హడావుడి, ఇంత ప్రచారం, ఇంత ఉత్కంఠ అనవసరం. వాస్తవానికి ఇటువంటి కమిటీలకు ఉన్న పరిమితులు తెలియక ప్రజలు శ్రీకృష్ణ కమిటీ నుంచి ఎక్కువ ఆశించి ఉంటారు. ఒకే ఒక సిఫార్సు చేయాలని కోరుకొని ఉంటారు. ఇది కమిషన్ కాదు. కేవలం కమిటీ. హోంశాఖ నియమించిన సంఘం. ఇటువంటి కమిటీ ఏదైనా ఏదో ఒక్క సిఫార్సు చేయలేదు. ఒకటికి మించి సిఫార్సులను చేసి వాటిలో ఏదో ఒక ప్రతిపాదనను స్వీకరించే సావకాశం ప్రభుత్వాలకు కల్పించడం ఆనవాయితీ. అదే పద్ధతిలో శ్రీకృష్ణ కమిటీ వ్యవహరించింది. కమిటీ చేసినవీ, చేయగలిగినవీ సూచనలే కానీ నిర్ణయాలు కాదని అందరూ అర్థం చేసుకోవాలి.

దశ-దిశ కార్యక్రమాలలో ప్రస్తావనకు వచ్చి శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులలో ప్రస్తావనకు రాని అంశాలు రెండు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని కొందరు సీమవాసులు చేసిన వాదనను కమిటీ పరిగణించినట్టు లేదు. ఉత్తరాంధ్రలో కూడా కొందరు ప్రత్యేక కళింగాంధ్రను ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. ఈ రెండు వాదనలనూ వినిపించినవారి సంఖ్య గణనీయమైనది కాదు కనుక కమిటీ పట్టించుకోకుండా వదిలిపెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చును. కానీ ఎక్కడా వినిపించని కొత్త వాదాన్ని ప్రజల ముందుకు తేవడాన్ని అర్థం చేసుకోవడం కష్టం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలను కలిపి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నది కమిటీ సృష్టించిన సంచలనాత్మకమైన కొత్త ప్రతిపాదన. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, ఉమ్మడి రాజధానిగానో చేయాలని చాలామంది దశ-దిశ కార్యక్రమాలలో కోరారు. కానీ చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలలనూ హైదరాబాద్ లో కలిపి విస్తారమైన కేంద్ర పాలిక ప్రాంతంగా ప్రకటించాలని ఎవ్వరూ కలలోనైనా కోరలేదు. ఇది కమిటీ సభ్యుల బుర్రల్లో పుట్టిన ఆలోచన అనుకోవాలి. యాభై నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న వాదోపవాదాలు కొత్త పుంతలు తొక్కడానికి అవసరమైన అంశాలను కమిటీ తన నివేదికలో చేర్చడం నిశ్చయంగా ఆక్షేపణీయం. సమస్యను జటిలం చేయడం ధర్మం కాదు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా లేక సమైక్య రాష్ట్రంగా కొనసాగాలా అన్నదే ప్రధానంగా చర్చనీయాంశం. ఈ రెండు వాదనలలో ఏ వాదం సమంజసంగా ఉన్నదో, ఏది అత్యధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమో పరిశీలించడం పరమావధి.

ఆరో ప్రతిపాదన ఉత్తమమైనదనీ, అయిదో ప్రతిపాదన రెండో ప్రాధాన్యం ఇవ్వదగినదనీ కమిటీ అంటోంది. అంటే, తెలంగాణ సామాజికార్థిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం, దానికి విశేషాధికారాలు ఇవ్వడం, రాజ్యాంగబద్ధమైన హామీలు ఇవ్వడం ద్వారా సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించడం కమిటి ప్రధమ ప్రాధమ్యం ఇచ్చిన సిఫార్సు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించడం రెండవ ప్రతిపాదన.

ఆరో ప్రతిపాదనకూ, మొదటి ప్రతిపాదనకూ పెద్ద తేడా లేదు. సామాజికార్థిక అభివృద్ధికి మండలాలు ఏర్పాటు చేయడం కొత్త ఆలోచన కూడా కాదు. తెలంగాణ కమిటీకి ఇప్పటికీ ఉప్పనూతల పురుషోత్తమరెడ్డి అధ్యక్షుడే. సీమాంధ్ర, రాయలసీమ కమిటీల అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించడానికి సైతం నిరాకరించారు. లోగడ చొక్కారావు వంటి నాయకుల నేతృత్వంలో ప్రాంతీయ మండళ్ళు పని చేశాయి. అన్ని ఒప్పందాల మాదిరే ఈ మండళ్ళు కూడా సవ్యంగా అమలు జరగలేదు. దీనికి కారణం పాలకులకు న్యాయభావన కొరవడటం. రాజ్యాంగపరమైన హామీలు ఎన్ని ఇచ్చినా పాలకులలో న్యాయభావన లేకపోతే హామీలు అమలుకు నోచుకోవన్నది అనుభవం నేర్పుతున్న పాఠం. ఒప్పందాలు అమలు కాకపోవడమే ప్రస్తుత సమస్యకు కారణమంటూ శ్రీకృష్ణ కమిటీ నివేదించింది. మళ్ళీ అటువంటి హామీలు ఇచ్చి సమైక్య గీతాలాపన కొనసాగించాలని సూచిస్తోంది. ఇందులో వైరుధ్యం ఉన్నప్పటికీ ఆరో సూత్రాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, నిర్ణయం అమలుకు చాలా గట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాజ్యాంగపరమైన హామీలు ఇచ్చి వాటిని పరిరక్షించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించవలసి ఉంటుంది. షరతులు లేని సమైక్య రాష్ట్రం కావాలని కోరుతున్నవారు తెలంగాణకు ప్రత్యేకమైన హామీలు ఇవ్వడాన్ని హర్షిస్తారో లేదో తెలుసుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులు లేకపోతే అయిదో సూచనే శరణ్యం అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరితో సాకల్యంగా చర్చించాలి. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి.

ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడం వల్ల ప్రయోజనం లేదని తేలిపోయింది. అదే పద్ధతిని కొనసాగించడంలో అర్థం లేదు. వ్యవహారాన్ని తేల్చకుండా నాన్చడానికి మాత్రమే ఈ పద్ధతి పనికి వస్తుంది. పార్టీల అధ్యక్షులను పిలిపించుకొని ప్రధాని, హోంమంత్రి మాట్లాడాలి. అఖిలపక్ష సమావేశాలలో కాదు. నేరుగా ముఖాముఖి మాట్లాడాలి. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాంతాలవారీగా రెండుగా చీలిన మాట కంటికి కనిపిస్తున్న వాస్తవం. ఆ పార్టీల తరఫున పీసీసీ అధ్యక్షుడు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ప్రత్యేక తెలంగాణ అనో సమైక్య రాష్ట్రం అనో ఏదో ఒక నిర్ణయం తీసుకుని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి లేదు. పీసీసీ అధ్యక్షుడు ఈ బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షురాలిపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా పెడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అధిష్ఠానం ఎట్లా చెబితా అట్లా నడుచుకుంటాం అన్నది వారి మంత్రం. టీడీపీ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కేంద్రం ఏ నిర్ణయం చేసినా సరే అది తమ తమది కాదనీ, కేంద్ర ప్రభుత్వానిదనీ కార్యకర్తలకు నచ్చజెప్పే అవకాశం తెలుగుదేశం అధినేతకు కావాలి. రెండు కళ్ళ విధానాన్ని అనుసరిస్తున్న టీడీపీ అధినేత మరోవిధంగా ముందుకు పోవడం సాధ్యం కాదు. రాష్ట్ర రాజకీయ నాయకులే తుది నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో చిదంబరం, ఇటీవల వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు పలాయనవాదానికి సంకేతాలు. సమస్యను పరిష్కరించకుండా వాయిదా వేయడానికి చూపించే సాకులు. మీనమేషాలు లెక్కపెట్టడానికీ, ఆషామాషీ వ్యాఖ్యలు చేయడానికి ఇది తరుణం కాదు. నిప్పుతో చెలగాటం ఆడటం మంచిది కాదు. పేరామిలటరీ దళాలను రంగంలో దింపి, కేంద్ర ప్రభుత్వం అస్పష్టమైన సంకేతాలు పంపడం వల్ల తీరని నష్టమే కానీ రవ్వంత ప్రయోజనం లేదు. రాష్ట్రంలో కొన్ని మాసాలుగా నెలకొన్న అనిశ్చితిని తొలగించే బాధ్యత కేంద్రానిదే. బాధ్యతాయుతమైన, దూరదృష్టి కలిగిన, నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయిలోని రాజకీయ పక్షాలు మనస్ఫూర్తిగా సహకరించాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని అమలుకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రజలు తమ వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ మౌనం కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుంది. పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నా, చేయిజారిపోతున్నా జోక్యం చేసుకోకపోవడం, చక్కదిద్దడానికి ప్రయత్నించకపోవడం క్షమార్హం కాని నేరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యాసదృశం అవుతుంది. ప్రజల పాలిట శాపం అవుతుంది.